సాక్షి, విజయవాడ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధర్నా పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిగా స్పందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేజ్రీవాల్ నిరాహార దీక్షను సాకుగా చూపి ముఖ్యమంత్రుల సమావేశాన్ని చంద్రబాబు బహిష్కరించాలని చూస్తున్నారని విమర్శించారు. విజయవాడలో ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ లాయర్లతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలనను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు.
ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న హడావుడి ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడిని తలపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయని, నిందితులకు టీడీపీ నాయకులే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్, బీజేపీ నాయకుడు ఆకుల సత్యనారాయణను పరామర్శించడానికే కలిశాడని స్పష్టం చేశారు. ఈ సంఘటనపైనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని చెప్పారు. రాజకీయ జన్మనిచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే ద్రోహం చేసిన చంద్రబాబు పంచన చేరిన యనమల ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.