‘బాబు 1500 రోజుల పాలన.. అవినీతి కుంభకోణాలు’

17 Jul, 2018 17:33 IST|Sakshi
కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు పాలనపై బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 1500 రోజుల పాలనలో 15 ప్రాజెక్టులైనా కట్టారా అని కన్నా నిలదీశారు. ఆయన మంగళవారం రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.  చంద్రబాబు 1500 రోజుల పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు.

చంద్రబాబు అనుభవజ్ఞుడని అధికారం కట్టబెడితే అవినీతి పాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు రాత్రికి రాత్రి పారిపోయి విజయవాడ వచ్చారని కన్నా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావలసిన వేల కోట్ల రూపాయలను ఓటు నోటు కేసుకు భయపడి అడగడలేదని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అంగీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ప్యాకేజీ ఇచ్చినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు సన్మానాలు కూడా చేశారన్నారు. అంతేకాక ప్రధాని మోదీని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాగా, చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా డిమాండ్‌ చేశారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అనుభవం అబద్దాలు ఆడటానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు