'మమ్మల్ని ముంచాలనుకుని మీరు మునగొద్దు'

8 Feb, 2018 15:57 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోనేత  అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి వినియోగిస్తున్న ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చిందేనని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి కేంద్రం రూ. 4 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాకు సాంకేతిక ఇబ్బంది ఉన్నందున.. ప్ర్యతేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. అపుడు సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా అభినందించారని గుర్తు చేశారు. కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్నా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.

ఏపీకి  పదేళ్లలో ఇవ్వాల్సింది.. రెండున్నర ఏళ్లలో బీజేపీ ఇచ్చిందన్నారు. మిత్రధర్మం అంటూనే బీసీ చట్టబద్ధత, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులకు కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. సోము వీర్రాజుపై దాడులు సరికాదన్నారు. తమని ముంచాలనుకుని.. టీడీపీ మునగొద్దని ఆయన హితవు పలికారు.

మరిన్ని వార్తలు