చిన్న కేసుకే సిట్‌ వేస్తారా..!

9 Mar, 2019 11:59 IST|Sakshi

టీడీపీ నేతలు ఎందుకు గాబరా పడుతున్నారు : కన్నా

సాక్షి, తిరుపతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం నేరమని అన్నారు. అయినా, డేటా చోరీ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న టీడీపీ నేతలు భుజాలెందుకు తడుముకొంటున్నారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలో నమోదైన చిన్న కేసు విషయమై ఏపీలో సిట్‌ ఎందుకు వేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. డేటా చోరీ కేసుతో టీడీపీ నాయకులంతా గాబరా పడుతున్నారని, ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బ్లాక్‌మెయిల్‌కు దిగుతోందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని గొంతు చించుకుంటున్న టీడీపీ పరువు నష్టం దావా ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (సవాల్‌ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!)

2017 నుంచి టీడీపీ చేస్తుందదే..!
తెలంగాణలో ఉన్న ఓట్లను ఏపీలో చేర్చే ప్రక్రియకు 2017 నుంచే టీడీపీ పూనుకుందని కన్నా ఆరోపించారు. ఏ గడ్డి తిని అయినా అధికారంలోకి రావాలని బాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫామ్‌-7 దాఖలు చేస్తే టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం తీరు చూస్తే డేటా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో మాదిరిగానే  చంద్రబాబు తీరు ఉందని అన్నారు. ఓటర్ల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. డేటా చోరీపై నియమించిన మూడు సిట్‌ల నివేదిలక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపిందని స్పష్టం చేశారు. ఈ నెల 13న బీజేపీ-బస్సుయాత్ర విజయనగరంలో ప్రారంభమై 21న కడపలో ముగుస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.

(చదవండి : స్కాం ‘సునామీ’.. లోకేశ్‌ బినామీ!?)

>
మరిన్ని వార్తలు