‘చైనాలోని పరిస్థితి.. ఆనాడు భారత్‌లో ఉంది’

26 Jun, 2018 22:04 IST|Sakshi
ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాల రాసి దివంగత నేత ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 1977లో జనతా పార్టీ ప్రభంజనం సృష్టించిందన్నారు. జనతా పార్టీ పోటీ చేస్తే ఆ ప్రభంజనంలో ఇందిరా గాంధీ ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

‘అసహనం పేరుతో ఎమర్జెన్సీ విధిస్తే వామపక్ష పార్టీలు మాట్లాడలేదు. పార్లమెంట్‌ సమావేశాలు ఒక్క రోజు కూడా జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంది. కాం​గ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే మతకల్లోలాలు జరిగాయి తప్ప, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాదు. కాంగ్రెస్‌ నేత జైపాల్‌ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ముక్త్‌ భారత్‌గా మార్చడమే  కాంగ్రెస్‌  లక్ష్యం.  దేశంలో చీకటి రోజులు ఉన్నాయంటే అది ఎమర్జెన్సీ రోజులే. బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదు.

నేటి తరం యువతకు ఎమర్జెన్సీ గురించి తెలియదు. ఇప్పుడున్న యువత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవాలి. ఆనాడు ఎమర్జెన్సీ గురించి పత్రికలు కూడా రాయకుండా ఆంక్షలు, బెదిరింపులకు పాల్పడ్డారు. చైనాలోని ఏ పరిస్థితి ఉందో ఆనాడు అదే పరిస్థితి భారత్‌ ఉంది. చాలా మంది జైలుకు పోయారు. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచుతారో తెలియదు. బీజేపీ నాయకులు ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, బండారు దత్తాత్రేయ, జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చాలా మంది జైలుకు పోయారని’ బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు