సొమ్ము కేంద్రానిది.. సోకు కేసీఆర్‌ది

20 Apr, 2018 12:10 IST|Sakshi
మాట్లాడుతున్న క్రాంతి

పెద్దపల్లిటౌన్‌: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను దారి మళ్లీస్తూ తానే అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అక్కెపల్లి క్రాంతి అన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ఆయుశ్‌మాన్‌ భవా పేరుతో నూతన ఉచిత బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబం మొత్తానికి వర్తించేలా సుమారు ఐదు లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారుల తరపున కేంద్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోందన్నారు. పొగరహిత వంటలతో గ్రామీణ మహిళలు ఆరోగ్య రక్షణ కోసం ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలందరి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అధిక నిధులను అందిస్తుండగా, కేసీఆర్‌ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాల్లో మునిగి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.  బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కేంద్రం అందిస్తున్న పథకాలు, నిధులపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి, వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఆయన వెంట నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్, యాంసాని వేణు, జంగ శ్రీనివాస్‌రెడ్డి, ముప్పిడి సమ్మయ్య, తూముల మల్లారెడ్డి, సిలివేరు మధు, కీర్తి శ్రీనివాస్, బుషనవేని వేణు తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు