బీజేపీ ఎదుగుదలను ఆడ్డుకోవడం కేసీఆర్‌ తరం కాదు

15 Jul, 2019 14:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరడంతోనే టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు. సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్‌ బీజేపీని కాపీ కొడుతుందని ఆరోపించారు. సభ్యత్వ నమోదు వల్ల టీఆర్‌ఎస్‌కు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్నారు. కేసీఆర్‌ కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు తప్ప మిగతా ఎవరికి టీఆర్‌ఎస్‌లో గౌరవం లేదన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో ఉంటేనే ప్రజల కోసం పని చేయగల్గుతామనే ఉద్దేశంతో తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

కేసీఆర్‌కు రాద్ధాంతం చేయడం తప్ప ఎలాంటి సిద్ధాంతం లేదు.. అందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణసాగర్‌ రావు మండి పడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవహారంలో ఒక్క కేసులోనైనా శిక్షలు వేశారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిలబడగల్గుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించింది.. అందుకు లావణ్య వ్యవహారమే ఉదాహరణ అన్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడం కేసీఆర్‌ వల్ల అయ్యేపని కాదన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చినందు వల్లే పలువురు నాయకులు బీజేపీలోకి వస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు