హిందూ మత విద్వేషకుల జాబితాలో కేసీఆర్‌

27 Jan, 2020 04:09 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) విషం చిమ్మే వారంతా మత విద్వేషకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోదీని ఎలా ఢీకొనాలో తెలియక మతాన్ని అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విద్వేషకుల జాబితాలోకి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా చేరారన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌. రామచందర్‌ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కాంగ్రెస్‌ కోరిందని, ఇప్పుడు కేసీఆర్‌ తీర్మానం చేస్తామని చెబుతున్నారన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని కేసీఆర్‌ కట్టు కథలు చెబుతున్నారని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు