హైదరాబాద్: డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలను నిర్వహిస్తున్నామన్న ఎన్నికల సంఘం ప్రకటనను స్వాగతిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి అభ్యర్థుల అభిప్రాయం సేకరించి కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు పంపించామని చెప్పారు. వారితో చర్చించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వివరించారు. గెలుపు గుర్రాలకే ఈసారి అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ నెల 10న అమిత్ షా పర్యటన ఉంటుందని వెల్లడించారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకెళతామని చెప్పారు. కేసీఆర్ తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారని, ఇద్దరూ దొందూ దొందేనని దుయ్యబట్టారు.