సాక్షి, న్యూఢిల్లీ : చంద్రబాబు తనయుడిపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు నమ్మకం లేదని అందుకే టీడీపీ నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు మునుపటిలాగా ఉండటం లేదని, ఏపీలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని వ్యాఖ్యనించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీయవద్దని తాము అనడం లేదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యిందని, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద బలహీనతనని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి తమకు సవాల్గా మారిందని, ఈ సవాల్ను త్వరలోనే అధిగమిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో కొత్త నాయకత్వం తయారు కాబోతుందని, కశ్మీర్ పరిస్థితి రోజురోజుకు మెరగవుతుందని మురళీధర్ పేర్కొన్నారు.