‘అందుకే కొత్త సచివాలయం కడుతున్నారు’

27 Jun, 2019 17:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయాన్ని కడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రూ. 600 కోట్ల విలువైన సచివాలయాన్ని కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికే రాని సీఎం కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన 16మంది సీఎంలు రూ. 69వేల కోట్లు అప్పు చేస్తే.. కేసీఆర్‌ ఏకంగా దాన్ని లక్షా 80వేల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి మీద రూ. 40వేలు అప్పు ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకొని నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.  అవినీతి కేసులు ఉన్న వారికి బీజేపీలో ఎటువంటి రక్షణ లేదన్నారు. బీజేపీలో చేరని వారు పార్టీ నియమాలను తగ్గట్టుగా వ్యవహరించాలని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు