చంద్రబాబుది ఓ ప్లాప్‌ షో : సోము వీర్రాజు

10 Dec, 2018 19:48 IST|Sakshi

సాక్షి, గుంటూరు : భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ సీఎం కాలేదని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అప్పట్లో చంద్రబాబు వల్లే వాజ్‌పేయి ఓటమి చవిచూశారని, బాబుది ఓ ప్లాప్‌ షో అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విఫలమైన మాదిరే దేశంలో కూడా బాబు విఫలం అవుతారని చెప్పారు. సోమవారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కనుమరుగు అవుతుందనే భయంతోనే ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఊహించిన దానికి విరుద్ధంగా ఏపీలో రాజకీయాలు జరగబోతున్నాయని తెలిపారు.

వ్యక్తిగత స్వలాభం కోసమే చంద్రబాబు రాజకీయాలు నడుపుతారని దుయ్యబట్టారు. బాబు వచ్చాక రాజకీయ వ్యవస్థ నాశనం అయిందని మండిపడ్డారు. బాబు నీచరాజకీయాలను బీజేపీనే అంతం చేస్తుందని అన్నారు. ఏపీలో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ లేకపోతే చంద్రబాబు జీరో అన్నారు. ఏపీలో జరిగే ప్రతి పథకం నిధులూ కేంద్రానివేనన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు పప్పుబెల్లాల్లాగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేపటి ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపి  విజయం సాధించబోతుందని జోష్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు