అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలు

23 Oct, 2018 15:07 IST|Sakshi
బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికి మూడున్నర ఏళ్లు అయినా అతీగతీ లేదని

విశాఖపట్నం: అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో విష్ణుకుమార్‌ రాజు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోందని అన్నారు. బాధితులకు ఉపశమనం లేకపోగా..రాను రానూ మనోధైర్యం కోల్పోతున్నారని బాధ వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు బయటకు రాక ముందు కొంతమంది రాజకీయ నేతలు, వారి బినామీలపైన కొనుగోలు చేసిన మాట వాస్తవమని చెప్పారు. అందుకే అగ్రిగోల్డ్‌ ఆస్తుల అసలు విలువ ఎంతో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మన ముఖ్యమంత్రి హైటెక్‌ ముఖ్యమంత్రని, ఫిన్‌టెక్‌ కోసం వచ్చారు కానీ అగ్రిగోల్డ్‌ బాధితుల గోడు వినడానికి మాత్రం రాలేదని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్‌ కేసుకు మూడున్నరేళ్లు: ఎమ్మెల్సీ మాధవ్‌
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికి మూడున్నర ఏళ్లు అయినా అతీగతీ లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. రిలయన్స్‌, ఎస్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీలు వారి వద్ద అతిచౌకగా కమిషన్‌లను కొట్టే కుట్ర జరగడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ప్రభుత్వ కుట్రను బయట పెట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయస్థానం ద్వారా సీబీఐ విచారణ కోరతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు