నరసింహన్ను టార్గెట్ చేసిన విష్ణుకుమార్ రాజు
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను టార్గెట్ చేశారు. గవర్నర్ నరసింహన్ను వెంటనే మార్చాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్ను నియమించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయమై గవర్నర్ తీరుపై విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. సంక్రాంతి పండుగ లోపు నాలా బిల్లును గవర్నర్ ఆమోదించి పంపాలని కోరారు.
నాలా బిల్లుపై గవర్నర్ నరసింహన్కు ఏపీ సర్కార్కు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. నాలా బిల్లుపై గవర్నర్ ఆమోదం పొందేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 3 నెలల కిందట పలు సలహాలు చేర్చి.. నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ కు పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం సలహాలను గవర్నర్ తోసిపుచ్చి దాన్ని తిప్పిపంపారు. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో ఆర్డినెన్స్ను ఆమోదించి.. గవర్నర్ నరసింహన్ కు ప్రభుత్వం మరోసారి పంపింది. కానీ గవర్నర్ మళ్లీ ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఈ బిల్లు విషయమై గతంలో చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.