సొమ్ము ఆంధ్రాది.. ప్రచారం పక్క రాష్ట్రాల్లో: విష్ణు

24 Apr, 2019 16:12 IST|Sakshi
బీజేపీ నేత విష్ణువర్దన్‌ రెడ్డి(పాతచిత్రం)

హైదరాబాద్‌: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రజల సొమ్ముతో బాబు ప్రత్యేక విమానాలలో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మాటలతో చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని  తేట తెల్లమవుతోందన్నారు. టీడీపీ జాతీయ పార్టీ కాదని, జాతి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై ఈ ఐదు సంవత్సరాలు  టీడీపీ ఎంపీలు కానీ చంద్రబాబు కానీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  


కాంగ్రెస్‌ ఈవీఎంలను హ్యాకింగ్‌ చేసిందని 2009లో బీజేపీతో కలిశాడు..బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్‌ చేసిందని ఆరోపించి 2019లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తున్నాడని విమర్శించారు. ఐఏఎస్‌లు సమావేశం పెట్టుకుంటే సీఎం వారిని బెదిరిస్తారా అని సూటిగా అడిగారు. ఈవీఎంల విషయంలో ఎలక్షన్‌ ఆఫీసర్ల దగ్గర సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఈవీఎంలపై మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడిని ప్రత్యేక విమానంలో వెంట పెట్టుకుని తిరిగింది చంద్రబాబేనని అన్నారు. వీవీపాట్‌ల వీడియోను బహిరంగ ప్రదర్శన చేసిన చంద్రబాబు మీద ఎన్నికల కమిషన్‌ సుమోటోగా చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 కేఏ పాల్‌ చేసిన ఆరోపణలే చంద్రబాబు కూడా చేస్తున్నారని..పాల్‌ ఏమైనా టీడీపీకి సలహాదారుగా పని చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. రాయలసీమ టీడీపీ నాయకులు అక్కడి వనరులను దోచుకుని సిగ్గూ ఎగ్గూ లేకుండా అక్కడి ప్రజలను అవమానిస్తున్నారని చెప్పారు. టీటీడీ బంగారం విషయంలో ఈవో, జేఈఓలను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్‌ చెయ్యలేదని సూటిగా ప్రశ్నించారు. రూ.400 కోట్ల విలువ చేసే బంగారాన్ని అంత నిర్లక్ష్యంగా తరలిస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు వివరణ ఇస్తే సరిపోతుందా అని సూటిగా అడిగారు. దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు