ఏపీ దొంగలంతా చంద్రబాబు చుట్టే ఉన్నారు

13 Apr, 2019 14:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పనిచేయడంలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో తన దుకాణాన్ని అమరావతి నుంచి ఢిల్లీకి మార్చి ఈవీఎంల పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలా చెల్లుతుందుని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఓటు వేసి వచ్చాక గంట, రెండు గంటల్లోనే 30 శాతం ఈవీఎంలు పని చెయలేదని అసత్యపు ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ కి ఓటేస్తే బీజేపీ కి పడుతుంది అంటున్న చంద్రబాబు.. ఒకవేళ తమ పార్టీకి ఓట్లు రాకపోతే ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు చంద్రబాబు ఒప్పకుంటారా అని సవాల్‌ చేశారు. రూ.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని కొందరు తన వద్దకు వచ్చారని చం‍ద్రబాబు చెబుతున్నారు.. అంటే ఆయన కార్యాలయం ఏమైనా దొంగలకు అడ్డనో చంద్రబాబు చెప్పాలన్నారు. ఈదేశంలో ఈవీఎంల దొంగల ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నేతలు మాత్రమే అన్నారు.


ఆంద్రప్రదేశ్ దొంగలంతా చంద్రబాబు పక్కనే ఉన్నారన్నారు. ఈవీఎంలు,ఐటీ గ్రిడ్ చోర్ లకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని..ఈ విషయంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహంతి కుటుంబానికి మంచి పేరు ఉంది అలాంటి అతన్ని కడప నుండి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. వ్యవస్థలో పని చేసే ఏ ఒక్క అధికారిని చంద్రబాబు గౌరవించరని ఆరోపించారు.ఎన్నికల్లో టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు. మోదీని తిడితే ఓట్లు పడవన్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 2014 ఎన్నికల్లో డీజీపీ తప్పించాలని లేఖ రాసి మార్పించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు డీజీపీని మారిస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో దుష్ట పాలన పోవాలని.. స్పీడ్ బ్రేకర్ ప్రభుత్వం పోవాలని తాము ఓట్లు అడిగామన్నారు.  ప్రజల తీర్పు ఎలా ఉన్నా సమీక్షించుకుంటామని చెప్పారు. 

మరిన్ని వార్తలు