ప్రధాన మంత్రి రైతు పక్షపాతి 

6 Jul, 2018 06:46 IST|Sakshi
మాట్లాడుతున్న బుడ్డా శ్రీకాంత రెడ్డి

ఆత్మకూరురూరల్‌/వెలుగోడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని శ్రీశైలం నియోజకవర్గ బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల వెలుగోడు, ఆత్మకూరు పట్టణాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ని రైతన్నల ఆదాయం మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రధానంగా వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతున్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజా పాలనను మరిచి పూర్తిగా అవినీతి మయమైన టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని విమర్శించా రు.

రైతు వ్యతిరేక టీడీపీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. నీరు – చెట్టు కార్యక్రమం శ్రీశైలం ఎమ్మెల్యేకు కల్పతరువుగా మారింద న్నారు. మంజూరైన నిధుల్లో 90 శాతం  స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ ఎప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారులే ఉంటారని, ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా పేరుతో మొసలి కన్నీరుకారుస్తున్నారని విమర్శించారు.

వాస్తవాలు చెబుతున్న తమ పార్టీ నాయకులు దాడులు చేయించడం దారుణ మన్నారు. వరికి మద్దతు ధర ప్రకటించడం పట్ల వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్‌లో,  ఆత్మకూరు గౌడ్‌ సెంటర్‌ బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మల్లె కృష్ణారెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి,  విశ్వరూపాచారి, విశ్వనాథం, మౌళీ, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, చండ్ర వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణ్ణ, ప్రతాప్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు