టీఆర్‌ఎస్‌ అండతోనే.. ఎంఐఎం రెచ్చిపోతుంది : లక్ష్మణ్‌

7 May, 2019 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ వివాదంపై బీజేపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్వర్యంలో మంగళవారం హోం మంత్రిని కలిశారు. అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అంబర్‌పేట్‌లో మా ఎమ్మెల్యేతో సీపీ, పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఓ వర్గం వారు అంబర్‌పేట్‌లో స్థానికులపై రాళ్లు రువ్వారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్‌ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్థన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్‌ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్‌ చేస్తే స్థానిక అంబర్‌ పేట్‌ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని లక్ష్మణ్‌ విమర్శించారు.

ప్రభుత్వ స్థలంలో ఓ వర్గం వారు మందిరం కడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అండ చూసుకునే.. ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతుంది.. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబర్‌పేటలో ఏ ప్రార్థన మందిరం కట్టినా ఊరుకోమని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేపై దాడి చేసిన సీపీ, పోలీసులతో పాటు.. పాషా ఖాద్రి, వక్ఫ్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు లక్ష్మణ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు