బీజేపీకి ఓటమి తప్పదు : పవార్‌

23 Oct, 2018 13:49 IST|Sakshi

రాజస్తాన్‌లో బీజేపీకి ఓటమే : శరద్‌ పవార్‌

సాక్షి, ముంబై : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి పరాభావం తప్పదని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ జోస్యం చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో సాగుతున్న బీజేపీ పాలన తిరిగి అధికారం నిలబెట్టుకోలేదని.. మహారాష్ట్రలో కూడా తిరిగి అధికారంలోకి రావడం అంత తేలిక కాదని ఆయన అభిప్రాపడ్డారు. మంగళవారం ముంబైలో జరిగిన ఓ మారథాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్‌ పార్లమెంటేరియన్‌ పలు అంశాలపై ముచ్చటించారు. 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ  సాధించే అవకాశం లేదని.. 2004లో జరిగిన విధంగానే విపక్షాలతో కూటమి ఏర్పడక తప్పదని అన్నారు.

రాహుల్‌ కష్టమే..
ఆయన మాట్లాడుతూ.. ‘‘1999 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి పాలనపై ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినా.. 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే పునరావృత్తమైయ్యే అవకాశం లేకపోలేదు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకవపోవచ్చు. ప్రతిపక్షాల్లో మోదీని ఢీ కొట్టే నాయకడు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. విపక్షాలు అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరనేది స్పష్టత లేదు. 2004లో అనూహ్యంగా ఆర్థికగా వేత్త మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని ఐనట్లు ఎవరైనా కావచ్చు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ మోదీ, రాహుల్‌ మధ్య ఉంటుందనుకుంటే పొరపాటే. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి నిలబడే అవకాశం లేదు. కూటమి మధ్య అవగహన ఏర్పడడం కష్టమే’’ అని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ పేరును పవార్‌ కొట్టిపారేశారు. ఎన్నికల ముందుగానే రాహుల్‌ను ప్రధానిగా ప్రకటించి.. కాంగ్రెస్‌ పార్టీ సాహాసం చేయలేదని అన్నారు.  రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించమని మాజీ కేంద్ర మంత్రి ఇటీవల పీ. చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాజస్తాన్‌లో బీజేపీకి ఓటమి తప్పదని, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ నెలకొందని విశ్లేషించారు. కాగా ఎన్నికల నుంచి శరద్‌ పవార్‌ రిటైరైన విషయం తెలిసిందే. చివరి సారిగా జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం పవార్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

మరిన్ని వార్తలు