నెహ్రూ బీఫ్‌ తినేవారు.. ఆయన పండిట్‌ కాదు!

11 Aug, 2018 09:02 IST|Sakshi

ఆయన పండిట్‌ కాదు

బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ :  దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ బీఫ్‌ (పశుమాంసం), పందిమాంసం తినేవారని, ఆయన అసలు పండిటే కాదని రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే గయాన్‌దేవ్‌ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్వార్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నెహ్రూ పండిట్‌ కాదు. ఆయన బీఫ్‌, పందిమాంసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్‌ అని ఎలా అంటారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పార్టీ నెహ్రు పేరు ముందు పండిట్‌ అని చేర్చింది’ అని వ్యాఖ్యానించారు. అహూజా ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం కులం పేరును వాడుకొంటుందని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాజస్తాన్‌ పీసీసీ ప్రెసిడెంట్‌ సచిన్‌ పైలెట్‌ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ దేవాలయాలను దర్శించుకోవడం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచే నేర్చుకున్నారని ఆయన తెలిపారు. అహుజా ఇదివరకు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవును చంపుట ఉగ్రవాదం కన్న పెద్ద నేరమని, హిందు బాలికలను లవ్‌ జిహాద్‌ పేరుతో ముస్లింలు బలవంతంగా మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ గతంలో పేర్కొన్నారు.​ దేశ రాజధానిలో జరిగే లైంగిక దాడులకు 50శాతం బాధ్యత జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులదే అని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు