ఒంటరిగానే పోటీ చేస్తాం

8 Sep, 2018 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ది అనైతిక పొత్తు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి వాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో  టీడీపీ సిద్ధాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును తిప్పికొట్టాలని అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రకటనతో రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఆనాటి రజాకార్ల పాలనను అక్బరుద్దీన్‌ మళ్ళీ తెరపైకి తీస్తున్నారని అన్నారు. ఎంఐఎం సీట్లలో టీఆర్‌ఎస్‌ ముస్లిం అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వల్లే ఎంఐఎం ముఖ్యమంత్రి పదవి కావాలని ప్రకటన చేస్తోందని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం ఓవైసీ సోదరులేనని పేర్కొన్నారు. 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని  ఆయన తెలిపారు. ఈ నెల 15న బీజీపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పారు. నాటికి నేటికి పరిస్థితి ఏమి మారిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత  బీజేపీ అభ్యుర్ధులను ప్రకటిస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు