వారికి ఓట్లు అడిగే హక్కు లేదు...

13 Sep, 2018 10:00 IST|Sakshi
ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి, నాయకులు

పాలమూరు (మహబూబ్‌నగర్‌) : కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు ఏ మాత్రం లేదని... నీతిమాలిన, అన్ని రకాల నేరాలకు పాల్పడని దోషులు ఆ పార్టీల్లో ఉన్నారని బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీది ఐరన్‌ లెగ్‌ అని.. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే టీడీపీ, కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడి టీఆర్‌ఎస్‌లో చేరడం సిగ్టుచేటన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో ఏదై నా ప్రత్యామ్నాయ పార్టీ ఉందంటే కేవలం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కేసీఆర్‌ ఏ రోజు గొంతు విప్పలేదని.. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్‌ వరకు తెలంగాణ కోసం పోరాడింది బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని ఎద్దేవాచ ఏశారు. కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మొద్దని ప్రజలను ఆయన కోరారు. పాలమూరు నుంచి వందల ఎడ్ల బండ్లతో నీటి కోసం, తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర బీజేపీకి ఉందన్నారు. కౌరవులు వంద మంది ఉన్నా పాండవుల విజయం ఎలా సాగిందో.. తెలంగాణలో విజయం బీజేపీ పక్షాన ఉంటుందన్నారు. 

15న అమిత్‌షా సభ 
ఈనెల 15న మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నిక శంఖారావం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అ మిత్‌ షా పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన పాలమూరు నుంచే ఎన్నికల శం ఖారావం పూరించనున్నారని చెప్పారు. ఈ సభ కో సం ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణ జరుగుతుందన్నారు. అయితే, ఇటీవల టీఆర్‌ఎస్‌ దౌర్జన్యంగా బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు తీసుకున్నట్లు కాకుం డా చాలా క్రమశిక్షణతో తమ కార్యకర్తలు వస్తారని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఆట ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు నాగూరావు నమాజీ, రతంగ్‌ పాండురంగారెడ్డి, శాంతకుమార్, పడకుల బాలరాజు పాల్గొన్నారు.

ఎంవీఎస్‌ కళాశాల మైదానం పరిశీలన 
ఈనెల 15న బీజేపీ ఎన్నికల శంఖారావం సభ జరగనున్న ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానాన్ని కిషన్‌రెడ్డి పరిశీలించారు. సభా వేదిక, ఇతరత్రా ఏర్పాట్లపై నాయకులకు సూచనలు చేశారు.  

మరిన్ని వార్తలు