‘ఐటీ దాడులంటే అంత భయమేందుకు బాబు..’

6 Oct, 2018 12:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి గూడెం : ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు.. ఎన్నికల్లో పంచడం కోసం దాచుకున్న డబ్బులు బయటపడతాయనా అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు కనీసం 10శాతం ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. టీడీపీకి పూర్తిగా అండగా నిలబడిన పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికైన పశ్చిమ నేతలు బాబుకు భజన చేయడం ఆపితే మంచిదని వ్యాఖ్యనించారు.

గోదావరి జిల్లాలలో విద్యావ్యవస్థపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని.. గోదావరి ఆధునీకికరణను కూడా పట్టించుకోలేదని.. వీటన్నింటికి బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రుణమాఫీ పేరుతో బాబు రైతులను అప్పుల్లో ముంచేత్తారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను పట్టించుకోని టీడీపీ ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు.. ఎన్నికల కోసం దాచుకున్న డబ్బులు బయటపడతాయనా అంటూ మాణిక్యాలరావు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు