యల్లాపుర ఎమ్మెల్యే శివరామ హెబ్బార
యశవంతపుర : బీజేపీ నాయకులు తన భార్య వనజాక్షితో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేప్ అబద్ధమని కారవార జిల్లా యల్లాపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే శివరామ హెబ్బార ఖండించారు. బీజేపీకి మద్దతివ్వాలని చూపిన ప్రలోభాలపై ఎమ్మెల్యే శివరామ హెబ్బార మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్టు చేస్తూ న్యూస్ చానల్లో రూ.15 కోట్ల డబ్బులు, మంత్రి పదవిని ఇస్తామంటూ వచ్చిన టేప్ వాయిస్పై తాను శనివారం శాసనసభలో ఉండగా అలస్యంగా తెలిసిందన్నారు.
తన భార్యకు ఎవరూ ఫోన్ చేయలేదని, చానల్లో వచ్చిన వాయిస్ తన భార్యది కాదని ఖండించారు. అబద్ధపు టేప్ను విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫేస్బుక్లో పోస్టు చేశారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కొడుకు విజయేంద్ర వనజాక్షితో మాట్లాడినట్లు కాంగ్రెస్ నాయకుడు వీఎస్ ఉగ్రప్ప ఆరోపించటంతో వివాదం పెద్దదైంది. దీనిపై యల్లాపుర ఎమ్మెల్యే శివరామ హెబ్బార్ స్పష్టీకరణ ఇచ్చారు.