డ్రామాలు చేయకండి.. ముస్లింలకు ఎమ్మెల్యే వార్నింగ్‌

4 Jan, 2020 13:09 IST|Sakshi

సాక్షి, బెంగళూరు :  మైనార్టీలపై బీజేపీ బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో హిందువులు 80 శాతం మంది ఉన్నారు. మైనార్టీల కేవలం 17శాతం మాత్రమే ఉన్నారు. హిందువుల తలచుకుంటే ఏమైనా చేయగలరు. వారితో చాలా జాగ్రత్తగా మెలగండి. లేకపోతే అందరినీ కట్టగట్టి పాకిస్తాన్‌కు పంపుతాం. మేం కర్ణాటకలో అధికారంలోకి వచ్చి కేవలం​ ఐదు నెలలు మాత్రమే అవుతోంది. డ్రామాలు చేయకుండా సైలెంట్‌గా ఉండండి.’ అంటూ మైనార్టీలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. శనివారం బళ్లారిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళన చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్‌ నేతలను సోమశేఖరరెడ్డి ఇడియట్స్‌గా వర్ణించాడు. దేశంలో నివసించాలి అనుకునే వారు ఇక్కడి ప్రభుత్వం చెప్పినట్టు వినాలని అన్నారు. అలాగే మైనార్టీలు (ముస్లిం) కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగుళూరులో జరిగిన నిరసనల్లో పోలీసులు కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి మరణించాడు.

మరిన్ని వార్తలు