చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

16 Mar, 2018 13:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గెలవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, గతంలో వాజ్‌పేయి చరిస్మాతో  గెలుపొందారని ఎమ్మెల్సీ మాధవ్‌ గుర్తు చేశారు. గతంలో  తన ప్రాణం ఉన్నంత వరకూ బీజేపీతో పొత్తుపెట్టుకోనని చెప్పిన చంద్రబాబు మళ్లీ దేశంలో నరేంద్ర మోదీ హవా ఉండటంతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని దుయ్యబట్టారు.

పైపెచ్చు నాలుగున్నరేళ్లలో ఏపీకి బీజేపీ ఎంతో చేసినా..  ఏమీ చేయలేదని ​కేంద్రంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ తో తాము కుమ్మక్కు కాలేదని...టీడీపియే వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్యేలతో కుమ్మకై వారికి మంత్రి పదవులు  ఇచ్చారని ధ్వజమెత్తారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు ఎక్కువ మాట్లాడే అవకాశం వస్తుందని, కాంగ్రెస్‌ ద్వారా బీజేపీపై అవాకులు చవాకులు చెప్పించాలని చూస్తున్నారన్నారు. టీడీపీ తమతో విడిపోయి బీజేపీ నెత్తిన పాలు పోసిందన్నారు. టీడిపీ తమపై కుట్రలు చేస్తుందని ఎమ్మెల్సీ మాధవ్‌  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మరిన్ని వార్తలు