చెప్పిందే చెప్పడంలో సీఎం దిట్ట..!

22 Jun, 2018 14:53 IST|Sakshi
బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయనగరం : బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తీతువు పిట్టలా అరుస్తూ, అబద్ధాలు చెబుతూ.. చెప్పిందే చెప్తూ రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం ఏదో వెలగబెడుతున్నట్టు ప్రజల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. పనికిరాని పర్యటనలతో ప్రజాధనం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

‘తీతువు పిట్ట సముద్రం ఒడ్డున పడుకొని ఆకాశాన్ని కిందపడకుండా ఆపానని కలలు కంటుందట. చంద్రబాబు తీరు అలానే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజీపీని అడ్డుకుంటానంటున్న ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం’ అని వ్యాఖ్యానించారు. బాబు రాజకీయాలను ఆ పార్టీ నాయకులే సహించలేక పోతున్నారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా బలపడదామనుకునే ఆయన కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రూపేణా రావాల్సిన 16,500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, మోదీ సర్కారును బద్నాం చేయడానికి చంద్రబాబు ఆ నిధులను తీసుకోవడం లేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు