‘కుట్ర కత్తి’పై బాబుకెందుకు భయం పట్టుకుంది..!

22 Jan, 2019 13:14 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. వైఎస్‌ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగినపుడు సింపుల్‌గా మాట్లాడిన చంద్రబాబు నేడు ఎన్‌ఐఏ విచారణ వద్దంటూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు.  దొరికిపోతాననే భయంతోనే బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్థికి కేంద్రంలోని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. సర్వశిక్ష అభియాన్‌ కింద కస్తూర్బా పాఠశాలకు కేంద్రం 600 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మోరంపూడిలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి, హార్టికల్చర్ సబ్ సెంటర్లకు నిధులను కూడా కేంద్రమే ఇచ్చిందన్నారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. దానిలో నుంచి కాపులకు ఏపీలో 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థలో ఉన్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. చంద్రబాబు పరిపక్వత లేని నిర్ణయంతో సమాజంలోని రెండు వర్గాల మధ్య దూరం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాపులకు, అగ్రవర్ణాలకు చిచ్చు..!
అధికారం కోసమే అగ్ర అగ్రవర్ణాల రిజర్వేషన్లలో 5 ఐదు శాతం కాపులకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బాబు అగ్రవర్ణాలు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో మాల మాదిగల మధ్య, మొన్నటికి మొన్న బీసీలు, కాపుల మధ్య గొడవ పెట్టారు. బాబు మోసాన్ని కాపులు గమనించాలి’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాను ఎవరికి లేఖ రాయలేదని అన్నారు. ఇక్కడ ఉన్న శాంతి భద్రతలపై మాత్రమే హోం మంత్రికి లేఖ రాశానని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలపై స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సహాయంపై మంత్రి మాటలకన్నా ఇంకేం ఆధారం కావాలని చురకలంటించారు.

మరిన్ని వార్తలు