‘చంద్రబాబుకి బహిష్కరణ రత్న అవార్డు ఇవ్వాలి’

6 Oct, 2018 15:27 IST|Sakshi

సాక్షి, ఏలూరు : అవినీతిలో దేశంలోని ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోటీ పడలేరని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం ఏలూరులో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆవేదన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడూతూ.. టీడీపీ ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకూ అందరూ కొన్ని తరాలకు సరిపడే సొమ్మును సంపాదించుకున్నారని విమర్శించారు. అవినీతిలో ఏపీని చం‍ద్రబాబు నెంబర్‌ వన్‌ చేశారన్నారు. చంద్రబాబు అవినీతికి ‘ బహిష్కరణ రత్న’ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

సర్వ శిక్ష అభియాన్‌లో 3500 పాఠశాలలకి రంగులు వేయడానికి 3కోట్లు ఖర్చుకాగా, దానికోసం 120కోట్లు రూపాయల జీవో ఇచ్చారని మండిపడ్డారు. పోలవరం ఆర్‌ఆర్‌ ప్యాకేజీలో జంగారెడ్డిగూడెం మండలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. 13వేల కోట్లతో రాష్ట్రంలో మట్టి తవ్వేశారట.. ఇందులో అవినీతి మీడియాకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుని మించిన నటుడు ఎక్కడా లేడని ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మళ్లీ అన్ని పథకాలకు ఆయన పేరు పెడుతున్నారని విమర్శించారు. బాబును ప్రజలే తరిమికొడుతారని సోము వీర్రాజు అన్నారు.

మరిన్ని వార్తలు