సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తానేం సంతోషంగా లేననే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. పైగా తనకు తాను గరళ కంఠుడిలా అభివర్ణించుకుంటూ శనివారం ఓ సన్మాన కార్యక్రమంలో వేదికపైనే ఆయన కంటతడి పెట్టుకున్నారు కూడా. అయితే ఇదే అదనుగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సెటైర్ల వేయటం మొదలుపెట్టింది. ప్రజలను ఆయన పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండిపడుతోంది.
‘మన దేశం ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను అందిస్తోంది. నటులు కూడా వారి నటనతో ఆడియన్స్ను మైమరిచిపోయేలా చేస్తూ.. ఆకట్టుకుంటున్నారు. ఇదిగో అక్కడ మరో దిగ్గజ నటుడు కుమారస్వామి కూడా ఉన్నారు. తన నటనా పటిమతో ఏకధాటిగా ప్రజలను మూర్ఖులను చేస్తూ వస్తున్నారు... అండ్ ది బెస్ట్ యాక్టింగ్ అవార్డు గోస్ టూ... అంటూ వ్యంగ్యంగా ఓ పోస్టును బీజేపీ ట్విటర్లో పోస్టు చేసింది. పైగా దానికి కుమారస్వామి కంటతడి పెట్టిన వీడియోను జత చేసింది.
ఆయన సంతృప్తిగానే ఉన్నారు... ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వంపై కుమారస్వామి సంతృప్తిగానే ఉన్నారని జేడీఎస్ పార్టీ కార్యదర్శి దానిష్ అలీ పేర్కొన్నారు. సీఎం కుమారస్వామి కేవలం భావోద్వేగంతోనే అలా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ అలీ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. జేడీఎస్ కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. సీఎం పదవి ఇచ్చి తాము అమృతమే ఇచ్చామనీ, విషం ఇవ్వలేదని కాంగ్రెస్ చెబుతోంది. సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తే మంచిదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే.. సీఎం కుమారస్వామికి సూచిస్తున్నారు.
& the best acting award goes to..
Our country has produced talented actors. Actors who have mesmerised the audience with their brilliant performance, here we have another legendary actor Mr Kumaraswamy, an actor who has constantly fooled common man with his amazing acting skills pic.twitter.com/SNfi9LsAS6
— BJP Karnataka (@BJP4Karnataka) 15 July 2018