మమతపై నిషేధం విధించండి..!

15 May, 2019 08:39 IST|Sakshi

ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

కోల్‌కత్తా: ఎన్నికల సమయంలో బెంగాల్‌లో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఈసీకి విజ‍్క్షప్తి చేశారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మమత చేతిలో బంధీలుగా ఉన్నాయని వారు ఆరోపించారు. మే 19న జరిగే చివరి విడత ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనకుండా ఆదేశాలు జారీచేయాలని వారు డిమాండ్‌ చేశారు.

కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆరోవిడత పోలింగ్‌లో భాగంగా జరిగన అల్లర్లలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు గాయపడగా.. పోలింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పూర్తిగా బెంగాల్‌లోనే మకాం వేశారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజధాని కోల్‌కతాలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) కార్యకర్తల మధ్య తీవ్ర మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

అమిత్‌ షా ర్యాలీలో పాల్గొనగా, ఘర్షణలు జరగడంతో ర్యాలీని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అమిత్‌ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఈ గొడవ ప్రారంభమైందని అధికారులు చెప్పారు. కోపోద్రిక్తులైన బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలతో గొడవకు దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడి మోటార్‌ సైకిళ్లకు నిప్పు పెట్టారు. ప్రముఖ తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత కోల్‌కతాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో చివరి విడత ఎన్నికల్లో టీఎంసీ నేతలను కట్టడి చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు