బీజేపీ ఎంపీ కన్నుమూత

20 Oct, 2018 08:41 IST|Sakshi
బోలా సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

అనారోగ్యంతో బెగుసరయ్‌ ఎంపీ బోలాసింగ్‌ మృతి

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలుపు

పట్నా : బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌లోని బెగుసరయ్‌ ఎంపీ బోలా సింగ్‌ (80) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రాం మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బెగుసరయ్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు 2000 నుంచి 2005 వరకు బిహార్ రాష్ట్ర అసెంబ్లీ స్వీకర్‌గా వ్యవహరించారు. 

బిహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో 1939లో జన్మించిన బోలా.. పట్నా యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వామపక్ష భావాజాలం గల ఆయన 1967లో సీపీఐ మద్దతుతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత సీపీఐ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో కాంగ్రెస్‌లో చేరిన బోలా కొంతకాలం తరువాత పార్టీతో విభేదించి.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌  నేతృత్వంలో ఆర్జేడీ 1990లో అధికారంలోకి రావడంతో లాలూతో చేతులు కలిపారు. ఆ తరువాత 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెగుసరయ్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన అసెంబ్లీ స్వీకర్‌గా వ్యవహరించారు. ఎనిమిది సార్లు శాసన సభ్యుడిగా, రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు.

మరిన్ని వార్తలు