ఈసీ ఆధ్వర్యంలోనే ఐటీ దాడులు

5 Apr, 2019 18:00 IST|Sakshi
బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు(పాత చిత్రం)

ఢిల్లీ: అవినీతి మా జన్మ హక్కు అన్నట్లుగా టీడీపీ తయారైందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు దొంగతనం చేసినట్లు చంద్రబాబు వాంగ్మూలం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఆధ్వర్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం గానీ, సొంతంగా ఆదాయపన్ను శాఖ గానీ ఈ దాడులు చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలాతో జరిగే సోదాలు కావని తెలిపారు. తన నివాసంలో పోలీసులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ చెబుతున్నారు.. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తారని ఆయనకు తెలిసినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతోనే పోలీసులు సోదాలు నిర్వహించారని వెల్లడించారు.

బాబు తప్పుడు మాటలు మానుకోవాలి

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు మానుకోవాలని జీవీఎల్‌ సూచించారు. ప్రతి దానికి నరేంద్ర మోదీని విమర్శించడం సరైంది కాదన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వంద కోట్ల రూపాయల జరిమానా విధించడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుకి తన ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా నదిలో పర్యావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం  దెబ్బతీసిందని ఆరోపించారు. టీడీపీ నాయకులే  ఆ వంద కోట్ల రూపాయల జరిమానా కట్టాలి.. ప్రజాధనం నుంచి రూ.100 కోట్లు చెల్లించకూడదు.. చంద్రబాబుపై వ్యక్తిగతంగా జరిమానా విధించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించారు.

బాలకృష్ణకు పిచ్చి ముదిరింది

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు  పిచ్చి మరింత ముదిరిందని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.గతంలో తనకు మెంటల్‌ అని బాలకృష్ణ సర్టిఫికెట్‌ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పిచ్చి ఇప్పుడు మరింత ముదురుతోందని అన్నారు. మీడియాపైనా, ప్రజలపైన, టీడీపీ కార్యకర్తలపై  బండ బూతులతో బాలకృష్ణ విరుచుకు పడుతున్నారని విమర్శించారు. మతిస్థిమితం లేని బాలయ్యను చంద్రబాబు నాయుడు కంట్రోల్‌ చేయాలని సూచించారు. రైతు రుణమాఫీ ఇంతవరకు పూర్తిగా చంద్రబాబు చేయలేదు..అన్నదాత సుఖీభవ పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టి స్టిక్కర్‌ బాబుగా మారారని ఎద్దేవా చేశారు.
 

మరిన్ని వార్తలు