ఆంధ్రా ప్రయోజనాలకు బాబే అడ్డు: జీవీఎల్‌

16 Apr, 2019 17:47 IST|Sakshi
బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు(పాత చిత్రం)

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు మరోసారి మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఈసీ, ఈవీఎం, మోదీలపైన చంద్రబాబు సంబంధం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు డీఎంకేకు ఎందుకు మద్ధతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్‌ చెప్పారా అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటకకు పోయి ప్రచారం చేస్తున్నావ్‌.. ప్రత్యేక హోదాకు అక్కడి సీఎం కుమార స్వామి ఏమైనా మద్ధతిచ్చారా అని ప్రశ్న సంధించారు.

మరి చంద్రబాబు ఎందుకు వారిని సమర్ధిస్తున్నారని అడిగారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ కేసీఆర్‌, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్ధతు తెలిపితే ఆయనను విమర్శించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చౌకబారు మాటలు మానుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు