సీమను ఉద్ధరిస్తున్నట్టు పెద్ద బిల్డప్‌

27 Dec, 2018 16:55 IST|Sakshi
జీవీఎల్‌ నరసింహా రావు

చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తుత్తి స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేసి చంద్రబాబు మరొక డ్రామాకు తెరలేపారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు బాబుపై జీవీఎల్‌ ట్విటర్‌లో స్పందించారు. రాయేగా పోయేదేముందని శంకుస్థాపన చేశారని వ్యంగంగా మాట్లాడారు. ఇటువంటి అమలుకు నోచుకోని ‘చంద్రన్న శంకుస్థాపన రాళ్లు’ రాయలసీమలో చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అసలు గనుల వివరాలను అధ్యయనం చేయకుండా, పొందుపరచకుండా రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

చంద్రబాబు పాలనలో పని తక్కువ.. మోసం, ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డప్‌ ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌లో డిసెంబర్‌ 17న ఇవ్వని వివరాలు, కేంద్రం లేఖ చంద్రబాబు మోసానికి ఆధారాలు అని రెండు పేజీలను ట్విటర్‌లో జీవీఎల్‌ అప్‌లోడ్‌ చేశారు. వీటిపైన పనిచేయకుండా శంకుస్థాపన చేయడం డ్రామానే అవుతుందని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు