బీజేపీ ఎంపీ దారుణ వ్యాఖ్యలు

2 Jan, 2018 13:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నేపాల్‌ సింగ్‌ వ్యాఖ్యలు కాకరేపాయి. పుల్వామా ఎన్‌కౌంటర్‌ అంశంపై స్పందిస్తూ జవాన్లపై ఆయన చేసిన కామెంట్లు తీవ్ర విమర్శకు దారితీశాయి. సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు. చస్తుంటారు. అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా...  మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అంటూ నేపాల్‌ సింగ్‌ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.   

కాగా, రాంపూర్‌(యూపీ) ఎంపీ అయిన 77 ఏళ్ల  నేపాల్‌ సింగ్‌ మాటలు ఒక్కసారిగా దుమారం రేపాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అయి ఉండి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నేతలూ విమర్శించారు. దీంతో ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని.. ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు అని తెలియజేశారు. సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను కోరానని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు