సేనకు బీజేపీ సీఎం పీఠం ఇవ్వాలి: కేంద్రమంత్రి

17 Nov, 2019 20:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రిపబ్లిక్‌​ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అంథ్‌వాలే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చిచేందుకు ఆదివారం ఎన్డీయే పక్షాలు ఢిల్లీలోభేటీ అయ్యాయి.

ఈ సమావేశం అనంతరం అంథ్‌వాలే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేమీలేదని అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందుకు కూటమిగా పోటీచేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టుబట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇ‍వ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం‍దుకు శివసేన పావులు కదుపుతోంది.

మరిన్ని వార్తలు