రాజ్యసభ ఎన్నికలు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు

11 Jun, 2020 13:55 IST|Sakshi

జైపూర్‌ : రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎ‍న్నికల్లో ప్రత్యర్థికి ఓటు వేసే విధంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆశచూపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (‘కాంగ్రెస్‌ను పడగొట్టేందుకు కుట్ర’)

కాగా రాజస్తాన్‌లో మూడు స్థానాలకు ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం మొత్తం మూడింటిలో కాంగ్రెస్ రెండు స్థానాలు‌, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అయితే సరైన సంఖ్యాబలం లేకున్నా బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది. ఎన్నికల వేళ బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇ‍ప్పటికే గుజరాత్‌‌లో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. వారంతా బీజేపీ ఒత్తిడి మేరకు రాజీనామాలు చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. (ఎన్నికల వేళ షాకిస్తున్న ఎమ్మెల్యేలు)

మరిన్ని వార్తలు