‘దొంగే.. దొంగ అని అరవటం బాబుకు అలవాటు’

28 Mar, 2019 15:57 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ విధులు నిర్వహించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఐపీఎస్‌లపై ఈసీ వేటు వేయడంతో.. చంద్రబాబు ఈసీపై కక్షసాధించేందుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దొంగే దొంగ అని అరవటం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. స్వతంత్రంగా పనిచేసే ఎన్నికల కమిషన్‌కు నోటీస్‌ ఇవ్వడం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకమని, చంద్రబాబు ఈసీని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని విమర్శించారు. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజ్యాంగ విరుద్దంగా పనిచేస్తూ అరాచకం సృష్టిస్తూనే ఉన్నారంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ టీడీపీపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఓ గాలి పార్టీ అని అది ఇప్పుడు డ్రామా కంపెనీగా మారిందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని.. అలాంటి వ్యక్తి మరోసారి సీఎం అయితే ఈ రాష్ట్రానికే ప్రమాదమని పేర్కొన్నారు. చంద్రబాబు తాను చెప్పిందే జరగాలంటూ డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు