దూకుడు పెంచిన కమలనాథులు

25 Jun, 2019 02:33 IST|Sakshi

రాష్ట్రంలో ప్రధాన పార్టీగా బలపడేందుకు బీజేపీ కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా బలపడేందుకు దూకుడు పెంచింది. అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని, కార్యాచరణను సిద్ధం చేసుకుం టోంది. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు రాజకీయ బలాన్ని సమకూర్చుకోవడంలో నిమగ్నమైంది. ఒకవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసు కొనే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు ఉద్య మ కార్యాచరణను అమలు చేస్తూనే రాజకీయంగా అన్ని స్థాయిల్లోనూ బలం సంతరించుకునేందుకు చర్యలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలం క్రమంగా క్షీణిస్తున్నదనే అంచనాతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. రాష్ట్రంలో ఆ పార్టీ విపక్ష స్థానాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఏపీలో టీడీపీ బలహీనపడటంతో అక్కడా ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగేందుకు ఇతర పార్టీల నుంచి చేరికలను కొనసాగిస్తోంది.

తెలంగాణలోనూ కాంగ్రెస్‌తోపాటు టీడీపీకి చెందిన ముఖ్య నాయకులను, జిల్లాల్లో పార్టీ పటిష్టతకు ఉపయోగపడే నేతలను చేర్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల స్థానాన్ని రాజకీయంగా భర్తీచేయడంతోపాటు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు అన్ని స్థాయిల్లో అనువైన నాయకులను, రాజకీయ పలుకుబడి, గుర్తింపు ఉన్న నేతల చేరికలను పెద్ద ఎత్తున చేపట్టనుంది. ఈ నెలాఖరులోగా భారీ సంఖ్యలో ఈ పార్టీల నుంచి చేరికలకు రంగం సిద్ధం చేసింది.

ఈ నెల 27న ఢిల్లీలో జాతీయ నాయకుల సమక్షంలో ముఖ్యనేతలు చాడ సురేశ్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సహా 30 మంది వరకు సీనియర్‌ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నా రు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం చేరికలకు ముహూ ర్తం ఖరారు చేసింది. ఈ నెలాఖరులోగా మరికొంద రు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. త్వరలోనే కాంగ్రెస్‌ నుంచి పలువురు సీనియర్లు తమ పార్టీలో చేరే అవకాశాలున్నట్టు బీజేపీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.  కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో జనగామ, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు సోమవారం బీజేపీలో చేరారు. 
 

మరిన్ని వార్తలు