మోదం... ఖేదం!

24 May, 2019 03:57 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు

కేంద్రంలో అధికారానికి ఆమడదూరంలో నిలవడంతో శ్రేణుల్లో నిరాశ

ఊరటగా తెలంగాణలో పెరిగిన స్థానాలు, ఓట్ల శాతం

రాష్ట్రంలో బీజేపీ దూకుడుతో అంతర్మథనంలో పార్టీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి మిశ్రమ అనుభవాన్ని మిగిల్చాయి. కేంద్రంలో అధికారం వస్తుందని ఆశించినా కూడా రెండోసారీ అందని ద్రాక్షగానే మిగలడంతో డీలాపడిన ఆ పార్టీ శ్రేణులకు రాష్ట్రంలోని ఫలితాలు కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా 2014 ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో సీట్లు, ఓట్లు పెరగడంతో పార్టీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, బీజేపీ రూపంలో దూకుడుగా వస్తున్న ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుందనే సంకేతాలను కూడా ఈ లోక్‌సభ ఫలితాలు ఇవ్వడంతో పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలయింది. మొత్తం మీద ఓ వైపు కేంద్రంలో అధికార దక్కకపోవడం, తెలంగాణలో ఫలితాలు ఆశాజనకంగా ఉండటం, ప్రతిపక్ష స్థానం కోసం మరోపార్టీ ముందుకు వస్తుండటం... వెరసి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఈ లోక్‌సభ ఫలితాలు మోదంతో పాటు ఖేదాన్ని కూడా మిగిల్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
అసెంబ్లీలో మెజార్టీ.. ఇప్పుడు ఢమాల్‌
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించగా, ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యత లభించింది. ఈ 2 నియోజకవర్గాల్లోని మెజార్టీ అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్‌ పార్టీనే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలపై కాంగ్రెస్‌ గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారుమారు కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులు లక్షపైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో గెలుపొందిన నల్ల గొండలో మళ్లీ గెలుపొందినా, నాగర్‌కర్నూల్‌లో ఓడిపోయారు. నల్లగొండలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందగా, నాగర్‌కర్నూల్‌లో దాదాపు 2 లక్షల ఓట్ల తేడాతో మాజీ ఎంపీ మల్లు రవి ఓడిపోవడం గమనార్హం.  

కమల వికాసంతో కలవరం...
ఇక, కాంగ్రెస్‌ గెలుపోటముల మాట అటుంచితే రాష్ట్రంలో బీజేపీ రూపంలో మరో పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం ముంచుకొస్తుందన్న రీతిలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని కలవరపెడుతున్నాయి. తమ కంటే ఓ సీటు ఎక్కువే గెలుపొందిన కమలనాథులు అదే రీతిలో ఓట్లు కూడా సాధించి ఓ రకంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను సవాల్‌ చేసే స్థాయికి చేరుకున్నారు. పైగా, కేంద్రంలో బీజేపీకే మళ్లీ అధికారం దక్కడంతో ఆ పార్టీ నేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని, అదే జరిగితే తమ మనుగడ ఏమవుతుందోననే ఆందోళన కూడా కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

‘అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఫలితాలు మాకు ఊరటనిచ్చిన మాట వాస్తవమే. ముఖ్య నేతలు గెలుపొందడం శుభపరిణామం. అయితే, రాష్ట్రంలో బీజేపీ మాకు గట్టి ప్రత్యర్థిగా తయారవుతుందన్న విషయాన్ని మా పార్టీ నేతలు గ్రహించాలి. పార్టీ మనుగడ కొనసాగాలంటే, ప్రతిపక్ష స్థానం నిలబెట్టుకోవాలంటే కమలనాథులతో కచ్చితంగా పోటీ పడాల్సిందే’ అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద సంతోషంతో పాటు ఆందోళన కలిగించేలా వచ్చిన లోక్‌సభ ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్‌ భవిష్యత్తును ఎటు వైపునకు తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.

గతం కంటే నయమే...
తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం 2 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి నంది ఎల్లయ్య మాత్రమే గెలిచారు. అయితే, ఈసారి మాత్రం ఏకంగా 4 స్థానాల్లో విజయం సాధించడం, పార్టీలోని కీలక నేతలు గెలుపొందడం శ్రేణులకు ఉత్సాహాన్ని మిగిల్చింది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు పార్టీ ఫైర్‌బ్రాండ్లు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతుండటం పార్టీ భవిష్యత్తుపై సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయింది. సీట్లతో పాటు ఓట్ల శాతం పెరగడం, జహీరాబాద్‌ లాంటి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో కూడా గట్టిపోటీ ఇవ్వడం ఆ పార్టీకి మంచి పరిణామమనే చెప్పాలి.  

>
మరిన్ని వార్తలు