మా కూటమికి 200 సీట్లు ఖాయం

6 Oct, 2019 04:56 IST|Sakshi

కూటమిలో ‘బిగ్‌ బ్రదర్‌’ఎవరూ లేరు

మహారాష్ట్ర ఎన్నికలపై జవదేకర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ–శివసేన కూటమి 200కుపైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తేల్చిచెప్పారు. బీజేపీ–శివసేన కూటమిలో పెద్దన్న అంటూ ఎవరూ లేరని అన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో మాట్లాడారు. రెండు నెలలవుతున్నా కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తాము రెండు నెలల్లో బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించామని చెప్పారు. భారీస్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని, 8 కోట్ల మందిని కొత్తగా తమ పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. బీజేపీ సభ్యుల సంఖ్య 19 కోట్లకు చేరిందని అన్నారు. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తమ కూటమి 200కుపైగా స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.    

అందరికీ న్యాయం చేస్తా: ఉద్ధవ్‌
శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ టిక్కెట్టు నిరాకరణకు గురైన వారికి న్యాయం చేస్తామని ఉద్ధవ్‌ తెలిపారు. తనని కలిసిన సామాజికవర్గాల నాయకులు సీట్లు కావాలని కోరలేదనీ, కేవలం తమ డిమాండ్ల సాధనకు తమ పక్షాన నిలవాలని మాత్రమే  కోరారనీ ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించని నాయకులు కూడా ఆయా సామాజిక వర్గాలకోసం పనిచేయాలని కోరారు. వారందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.  ఓబీసీ నాయకుడు ప్రకాష్‌ షిండే మాట్లాడుతూ తమకు న్యాయం చేస్తామని శివసేన హామీ యిచ్చిందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు