‘కర్ణాటక’ కోసం రూ.122 కోట్లు

17 Jan, 2019 04:10 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో వెచ్చించిన కమలనాథులు

ఈశాన్య రాష్ట్రాల్లో మరో రూ.14 కోట్ల వ్యయం

రాజకీయ విరాళాల్లోనూ టాపే

న్యూఢిల్లీ: 2018, మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రూ.122.68 కోట్లు ఖర్చు పెట్టినట్లు బీజేపీ తెలిపింది. ఇందులో రూ.84 కోట్లను ప్రచారం కోసం(బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు, పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, కేబుల్, వెబ్‌సైట్, ఇతర సామగ్రి) కోసమే ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది.  ఎన్నికల్లో స్టార్‌  క్యాంపెయినర్ల పర్యటనలకు మరో రూ.16 కోట్లు వెచ్చించామని పేర్కొంది. గతేడాది జరిగిన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.14.18 కోట్లు ఖర్చుపెట్టామని ఎన్నికల సంఘానికి(ఈసీ) సమర్పించిన నివేదికలో బీజేపీ తెలిపింది. వీటిలో మేఘాలయలో రూ.3.8 కోట్లు, త్రిపురలో రూ.6.96 కోట్లు, నాగాలాండ్‌లో రూ.3.36 కోట్లు వ్యయమైనట్లు పేర్కొంది.

విరాళాల్లో బీజేపీనే టాప్‌..
రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రాజకీయ పార్టీలకు మొత్తం రూ.469.89 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకే రూ.437.04 కోట్లు దక్కినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ తెలిపింది. కాంగ్రెస్‌ కేవలం రూ.26.25 కోట్లను అందుకున్నట్లు పేర్కొంది. బీజేపీ  విరాళం.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీల మొత్తం విరాళానికి 12 రెట్లు అధికమని పేర్కొంది. జాతీయ పార్టీలల విరాళాల్లో 90 శాతం కార్పొరేట్‌ సంస్థలు, మిగిలిన 10 శాతాన్ని వ్యక్తులు ఇచ్చారని ఏడీఆర్‌ చెప్పింది.

మరిన్ని వార్తలు