పశ్చిమాన హస్తమయం

24 May, 2019 05:19 IST|Sakshi

అన్ని చోట్లా మోదీ హవా

కొద్ది నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అయితేనేం!! ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు మళ్లీ మోదీ–షా ద్వయానికి పట్టం గట్టారు. ఫలితంగా కమలం మరింత వికసించింది. రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్ని బీజేపీ ఏకంగా క్లీన్‌స్వీప్‌ చేసి కాంగ్రెస్‌ను జీరో చేసింది. గోవాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీ తన ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో కనబరిచింది.

మహారాష్ట్రలోని 48 స్థానాలకుగాను బీజేపీ – శివసేన కూటమి 41 స్థానాలను గెలుచుకునే పరిస్థితిలో ఉంది. బీజేపీ సొంతంగా 23 స్థానాల్లో, శివసేన 18 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశాయి. కాంగ్రెస్‌ కూటమి 7 స్థానాల్లోను, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ శివసేనతో జట్టుకట్టి బరిలో దిగగా.. కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లు పోటీగా నిలిచాయి.  

గత ఎన్నికల సమయంలో బీజేపీ శివసేనలు కలిసికట్టుగా పోటీ చేసి ఘన విజయం సాధించినప్పటికీ ఆ తరువాతి కాలంలో ఇరు పార్టీలూ చెరోదారి పట్టాయి. నాలుగేళ్లపాటు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా ఎన్నికల సమయానికి మాత్రం రెండు పార్టీలూ మళ్లీ జట్టు కట్టేశాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో కనిపించిన మహారాష్ట్రలో బీజేపీ –శివసేన గెలుపు అంత సులభం కాబోదన్న అంచనాలు ముందుగా వెలువడినప్పటికీ ఫలితాల సమయానికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే శివసేనపై నేరుగా విమర్శలు గుప్పించడం, ప్రజల్లో ఆయన సభలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో శివసేన బలహీన పడుతుందని అంచనా వేశారు.

అయితే సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, ఎన్సీపీల్లో గందరగోళం నెలకొనడం... శరద్‌పవార్‌ పోటీ చేయకపోయినా ఆయన మనుమల వరసైన వారు ఇద్దరు బరిలో ఉండటం తదితర కారణాల వల్ల ఎన్సీపీని ప్రజలు పెద్దగా ఆదరించలేదన్న అంచనాలున్నాయి.  ముంబైలోని గుజరాతీ, మరాఠీ మధ్య తరగతి వర్గం గట్టి మద్దతునివ్వడంతో బీజేపీ– శివసేన కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించగలిగింది. కాంగ్రెస్‌– ఎన్సీపీలకు ముస్లిం మైనార్టీల మద్దతు కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో స్వల్ప స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊర్మిళ మటోండ్కర్‌ వంటి సినీనటిని ముంబై నార్త్‌ ఓటర్లు ఆదరించలేదు. మహారాష్ట్ర ఎన్నికల మొత్తానికి అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఔరంగాబాద్‌లో నమోదైంది. చతుర్ముఖ పోటీ కారణంగా ఓట్లు చీలిపోవడంతో ఆలిండియా ఇత్తేహదుల్‌ ముస్లమీన్‌ అభ్యర్థి ముందజలో నిలిచారు.

గుజరాత్‌లో కమలం క్లీన్‌స్వీప్‌
ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో భాజపా క్లీన్‌ స్వీప్‌ చేసి గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసింది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా గాంధీనగర్‌ స్థానంలో రెండు లక్షలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క అమ్రేలీ స్థానంలోనే ప్రతిపక్ష నేత పరేశ్‌ ధనాని బీజేపీ అభ్యర్థి నరన్‌ కచ్చాడియాకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య అంతరం అతిస్వల్పంగా ఉండటం గమనార్హం.


గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 23న పోలింగ జరిగింది. రికార్డు స్థాయిలో 64.11 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌  81 స్థానాలు సాధించడం.. బీజేపీ 99 స్థానాలతో అతికష్టమ్మీద అధికారం చేపట్టడం లోక్‌సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని అంతా అంచనా వేశారు.

అయితే పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాను స్వయంగా గాంధీనగర్‌లో పోటీకి దింపడం ద్వారా బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. లోక్‌సభకు పోటీ చేయడం అమిత్‌ షాకు ఇదే తొలిసారి. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్‌లో వ్యవసాయ సంక్షోభం సమస్య బీజేపీని కొంత కలవర పెట్టినా దాన్ని కూడా అధిగమించగలిగింది. జీఎస్టీ అమల్లోని లోపాలు గుజరాత్‌ వ్యాపారులను దెబ్బతీశాయని.. ఫలితంగా వారూ బీజేపీకి దూరం కావచ్చునని భావించారు. అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ.. బీజేపీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఘన విజయం సాధించింది. పాటీదార్‌       ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌లో    చేరి పోటీకి సిద్ధమైనప్పటికీ కోర్టు జోక్యంతో పోటీ చేయలేకపోయారు. మరోవైపు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌ను వీడిపోవడం ఆ పార్టీని బలహీన పరిచిందని    చెప్పవచ్చు.

గోవాలో సగం.. సగం..
పశ్చిమ కనుమల్లోని అతిచిన్న రాష్ట్రం గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నార్త్‌ గోవా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్‌ యశోనాయక్‌ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన గిరీశ్‌ రాయ ఛోడాంకర్‌పై భారీ మెజార్టీతో గెలవగా... దక్షిణ గోవాలో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన కోస్మే ఫ్రాన్సిస్కో కైటానో సర్డిన్హా  బీజేపీ అభ్యర్థి నరేంద్ర సావల్కర్‌పై స్వల్ప ఆధిక్యంలో విజయం సాధించారు.

ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ బరిలో ఉంది. మొత్తం 71 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నార్త్, సౌత్‌ గోవా రెండింటినీ గెలుచుకోగా.. ఈ సారి ఫలితం కాస్త తారుమారయింది. కేంద్రపాలిత ప్రాంతమైన దామన్‌ అండ్‌ డయ్యూ,లో బీజేపీ అభ్యర్థి లాలూభాయ్‌ బాబూభాయ్‌ ఘన విజయం సాధించగా..  దాద్రా అండ్‌ నగర్‌ హవేలీలో స్వతంత్ర అభ్యర్థి దేల్కర్‌ మోహన్‌ భాయ్‌ సాంజీ భాయ్‌ గెలుపొందారు.  

రాజకోటను గెలిచిందెవరు?
ఎన్నికల జరిగిన ప్రతిసారి అధికార పార్టీని ఓడించడం రాజస్థాన్‌ ప్రత్యేకత. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఈ రాష్ట్రంలో ఈ సారి కూడా కమలం పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను 24 స్థానాలను గెలుచుకుంది. ఒక్క స్థానంలో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ విజయం సాధించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టం కట్టిన రాజస్థాన్‌ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ అదేతీరును కనబరుస్తారని చాలామంది అంచనా వేశారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై ఉన్న అసంతృప్తిని అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా వ్యక్తం చేసిన ఓటరు లోక్‌సభకు వచ్చేసరి మరోసారి మోదీకి జై కొట్టినట్టు కనిపిస్తోంది.


ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లోట్‌  జోధ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగగా.. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన రాజస్థాన్‌లో ఏప్రిల్‌ 29, మే 6న రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోటీలో బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖాముఖి తలపడ్డాయి. రెండు దశల ఓటింగ్‌ శాతం 66.07గా నమోదైంది. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.


 

మరిన్ని వార్తలు