మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం: లక్ష్మణ్‌

13 Jun, 2019 19:08 IST|Sakshi
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌(పాత చిత్రం)

ఢిల్లీ: తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపై  బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ప్రత్యేకంగా అభినందించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ తెలిపారు. గురువారం బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంపై పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. తెలంగాణాలో మళ్లీ కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మా పార్టీలో చేరడానికి చాలా మంది వేచి చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ వైఫల్యాలపై ఉద్యమం ప్రారంభమౌతోందని అన్నారు.

వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుని సత్తా చాటుతామని చెప్పారు. కాంగ్రెస్‌ పట్ల ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని, దీనికి ఇటీవల లోక్‌సభ ఫలితాలే నిదర్శనమన్నారు. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని, గతంలో కాంగ్రెస్‌ చేసింది..ఇప్పుడు టీఆర్‌ఎస్‌ చేస్తోందని మండిపడ్డారు.  కేసీఆర్‌ అభద్రతా భావంతోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. సారు కారు ఢిల్లీలో సర్కార్‌ అని ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకున్నారు..కానీ కూతురు కూడా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జూలై 6న సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతామని, జూన్‌ 21న యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు.

మరిన్ని వార్తలు