బీజేపీ ‘కోల్‌’ వార్‌ 

29 Sep, 2019 09:31 IST|Sakshi
మాట్లాడుతున్న మల్లయ్య

టీబీజీకేఎస్‌ను దెబ్బతీసే లక్ష్యంతో కమలం పావులు 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో వ్యూహరచన 

సాక్షి ,కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి పరిధిలో పట్టుకోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతం వెంట విస్తరించి ఉన్న కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పట్టు సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న సుమారు 50వేల మంది పర్మనెంట్‌ ఉద్యోగులను, 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతం విస్తరించి ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సింగరేణి బెల్ట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులలో మినహా మిగతా 8 చోట్ల పరాజయాన్ని మూట గట్టుకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తరువాత పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, ప్రజాభిప్రాయం భిన్నంగా ఉందనే విషయాన్ని బీజేపీ గుర్తించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ద్వారా తన ప్రణాళికను అమలు చేసే ఆలోచనతో ఉంది. సింగరేణిలో ఎన్నికల్లో ఈసారి గుర్తింపు యూనియన్‌గా బీజేపీ అనుబంధ విభాగమైన బీఎంఎస్‌ను గెలిపించి కార్మిక క్షేత్రంలో పట్టునిలుపుకోవాలని ఆ పార్టీ నాయకులు కృత నిశ్చయంతో ఉన్నారు.

ఇప్పటికే కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఈబాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఈనెల 26న కేంద్ర రసాయనాల, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ రామగుండం పారిశ్రామక ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు. మంత్రి వస్తున్న సమాచారాన్ని అధికారికంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వకపోవడం సింగరేణిపై బీజేపీ దూరదృష్టిని తెలియజేస్తోంది.  ఈ పర్యటన అధికారికంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఫ్యాక్టరీ సందర్శన అయినప్పటికి కార్యకర్తల్లో మరింత విశ్వాసాన్ని నింపేందుకు 370ఆర్టికల్‌ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరై మీవెంట తామున్నామంటూ సందేశం పంపారు.  

పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌ అప్రమత్తం  
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియా గులాబీదళానికి అండగా నిలిచింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలోని నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలో మినహా దాదాపు అంతటా టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగరేసింది. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని తొలుత భావించినా, కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి ‘విజయ ప్రణాళిక’అమలు చేయడంతో భూపాలపల్లి, మందమర్రి మినహా అన్ని ఏరియాల్లో టీబీజీకేఎస్‌ ఘన విజయం సాధించింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా సింగరేణి ప్రాంతం పరిధిలోని పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహం అధికార టీఆర్‌ఎస్‌ నాయకులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇప్పటికే బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్‌ ఏరియాలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు గనులపై పర్యటించి తామున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నెల 29న భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరుకానున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు గనులపై సమావేశాలు నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నామని హామీ ఇస్తున్నారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కార్మిక సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు. గోదావరిఖని టీబీజీకేఎస్‌ కేంద్ర కమిటి కార్యాలయంలో ఆదివారం మూడు ఏరియాలకు చెందిన టీబీజీకేఏస్‌ నాయకులు కార్యకర్తలతో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సమావేశం కానున్నారు. బీఎంఎస్‌లోని టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్‌కు చెందిన ముఖ్య నేతలతో పాటు కార్మికులెవరూ వెళ్లకుండా కట్టడిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర అధిష్టానం నుంచి స్పష్టమైన దిశానిర్దేశం వచ్చినట్లు సమాచారం.

కేంద్రమంత్రికి ప్రత్యేక బాధ్యతలు 
సింగరేణి పరిధిలో పార్టీ బలోపేతం బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించినట్లు సమాచారం. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో కార్మిక క్షేత్రంగా ఉన్న ఆరు జిల్లాల నేతలతో కిషన్‌రెడ్డి టచ్‌లో ఉంటూ బీఎంఎస్‌  బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నుంచి బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సింగరేణి కార్మికులతో సంబంధాలు గల మాజీ ఎంపీ గడ్డం వివేక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ,  రామగుండం కార్పొరేషన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్లను కూడా చేర్చుకుంది. ఇప్పుడు బలమైన కార్మిక నాయకులపై దృష్టి పెట్టింది.

టీబీజీకేఎస్‌ కీలక నేత బీఎంఎస్‌లోకి.. 
టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గనికార్మిక సంఘం (టీబీజీకేఎస్‌)లో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్‌ నేత, ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్యను బీఎంఎస్‌లోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది.  మల్లయ్యతో పాటు అన్ని ఏరియాల నుంచి భారీగా చేరికలు ఉండవచ్చనే ప్రచారం సాగుతోంది. సుమారు 3వేల మంది తన వెంట బీఎంఎస్‌ చేరతారని మల్లయ్య చెబుతుండగా, లైన్‌లోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ దీనిపై దృష్టి సారించింది. 

కొత్తగూడెం కార్పొరేట్‌ నుంచి.. 
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానం మేరకు కార్పొరేట్‌ ఏరియా టీబీజీకేఎస్‌ యూనియన్‌కు రాజీనామా చేసిన నేతలమంతా ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరతామని టీబీజీకేఎస్‌ మాజీ నేత టి నరేంద్రబాబు తెలిపారు. శనివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ శరభలింగం, సంగం చందర్, మొగిలిపార రవి, వి.నర్సింహామూర్తి, శాంతకుమార్, కె.చిట్టిబాబు, ఎండీ జానీపాష, పండగ కాంతికుమార్, జి.నరేం దర్, కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

రేపు బీఎంఎస్‌లో ‘కెంగర్ల’ చేరిక 
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి జిల్లా): టీబీజీకేఎస్‌ మాజీ నేత కెంగర్ల మల్లయ్య ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసే సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, వేజ్‌బోర్డు సభ్యుడు డీకే.రాయ్‌ సమక్షంలో మూడు వేల మందితో చేరుతున్నట్లు ప్రకటించారు. మాదాసు రామ్మూర్తి, ప్రసాద్, తిరుపతి, ఓదెలు, యాకుబ్, కిరణ్, రాములు పాల్గొన్నారు.

సభను జయప్రదం చేయాలి 
గోదావరిఖనిలో ఈ నెల 30న బీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సభను విజయవంతం చేయాలని ఆ యూనియన్‌ సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీరమనేని రవీందర్‌రావు కోరారు. శనివారం మణుగూరు ఏరియా పీవి కాలనీ యూనియన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో వి రామక్రిష్ణ, శివరావు, కుమారస్వామి, మల్లిఖార్జున్, నర్సింహారావు, సత్యనారాయణ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు