బీజేపీ, శివసేన మధ్య కుదిరిన పొత్తు!

16 Feb, 2019 17:12 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయం

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు బీజేపీ, శివసేన మధ్య ఎట్టకేలకు పొత్తు చిగురించింది. మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ 25, శివసేన 23 సీట్లల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో శివసేన 22 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 26 సీట్లల్లో తమ అభ్యర్థులను నిలిపిన విషయం తెలిసిందే.

కాగా కీలక పొత్తుపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే చర్చించి, గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించిట్లు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. కాగా అయోధ్య రామమందిర ఏర్పాటుపై శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిల్లో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కేవలం హిందూవుల ఓట్ల కోసమే అయోధ్య అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందంటూ ఠాక్రే  గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్‌ షా.. సేనను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి బీజేపీతో పొత్తుకి ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. కానీ శివసేన మాత్రం ఇంకా  పొత్తులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


 

మరిన్ని వార్తలు