టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే: కె.లక్ష్మణ్
జహీరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంగళవారం ఓబీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. ఇక్కడి నుంచే ప్రజా సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.
ఉద్యమాలు, ఆత్మ బలిదానాలతో వచ్చిన రాష్ట్రంలో తమ సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మూడేళ్లలో కేవలం 16 వేలు మాత్రమే భర్తీ చేశారన్నారు.