రాజస్తాన్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

15 Nov, 2018 03:07 IST|Sakshi
దౌసా ఎంపీ హరీశ్‌ చంద్ర మీనా

న్యూఢిల్లీ/జైపూర్‌: రాజస్తాన్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దౌసా ఎంపీ హరీశ్‌ చంద్ర మీనా, నాగౌర్‌ బీజేపీ ఎమ్మెల్యే హబీబూర్‌ రెహమన్‌ కాంగ్రెస్‌లో చేరారు. రాజస్తాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, రాజస్తాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే సమక్షంలో బుధవారం మీనా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు హరీశ్‌ చంద్ర మీనా కూడా పోటీ చేయనున్నారు.

రాజస్తాన్‌ బరిలో సచిన్, గెహ్లాట్‌ పోటీ
రాజస్తాన్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో పోటీచేస్తామని కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ ప్రకటించారు. దీంతో సీఎం కుర్చీ కోసం అప్పుడే రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో పోరు మొదలయినట్లైంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం గెహ్లాట్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదనీ, తామంతా బీజేపీని సమిష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నడూ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదన్నారు.

మరిన్ని వార్తలు