బాబు ఇచ్చేది నిరుద్యోగభృతి కాదు..ఎన్నికల భృతే!

16 Sep, 2018 13:28 IST|Sakshi
చంద్రబాబు నాయుడు, రమేశ్‌ నాయుడు

విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబ్‌ వస్తుందని, రుణమాఫీ చేస్తానని ప్రచారం చేశారు..అధికారంలోకి వచ్చాక మాట తప్పారని బీజేవైఎం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ నాయుడు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వచ్చే అక్టోబర్‌ నుంచి ఇచ్చేది నిరుద్యోగ భృతి కాదని, ఎన్నికల భృతి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులకు చేసిన మోసాన్ని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామని వివరించారు. ఇంటికొక ఉద్యోగ హామీ ఊసే లేదు..రాష్ట్రంలో 2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

బాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి అంటూ షరతులు విధించారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు